వలస కార్మికులకు చికెన్ భోజనం

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు తెలంగాణ నిర్మాణ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో తినడానికి తిండి దొరికితే చాలని కొందరు వలస కార్మికులు అనుకుంటుండగా.. హైదరాబాద్ నిర్మాణ సంస్థ మంగళవారం ఏకంగా చికెన్ సరఫరా చేసింది. బాచుపల్లి, మల్లంపేట్ ప్రాజెక్టుల్లో పని చేసే కార్మికులకు నగరానికి చెందిన ప్రణీత్ గ్రూప్ మంగళవారం 1,250 కిలోల చికెన్ ను సరఫరా చేసింది. మొత్తానికి, రెండు వారాల వ్యవధి తర్వాత కార్మికులకు నాన్ వెజ్ తినే అవకాశాన్ని సంస్థ కల్పించింది. 


రెండు వారాల క్రితమే రెండున్నర టన్నుల బియ్యాన్ని కార్మికులకు సరఫరా చేసింది. ముందస్తుగా కొంత సొమ్మును అందజేసింది. ఏప్రిల్ 1న సుమారు రెండున్నర టన్నుల కూరగాయలు, వెయ్యి లీటర్ల మంచినూనెను సరఫరా చేసింది. తాజాగా, మంగళవారం 1250 కిలోల చికెన్ వలస కార్మికులకు అందజేసింది.  లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లోని వట్టి నాగులపల్లిలో చిక్కుకున్న దాదాపు 650 వలస కూలీలకు టెర్మినస్ ఇన్ఫ్రా సంస్థ.. మంగళవారం ఆరు వేల కిలోల బియ్యం, 1200 కిలోల కందిపప్పు, 1200 కిలోల మంచినూనెను సరఫరా చేసింది. వీరిలో ఎక్కువగా బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన కార్మికులే కావడం గమనార్హం. ఇదే సంస్థ ప్రతిరోజు నిరుపేదల ఆకలిని తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నది.